అఫ్గానిస్తాన్: ఏకే-47తో ఎదురుతిరిగి ‘హీరో’ అనిపించుకున్న అమ్మాయి చంపింది తాలిబన్లనా? తన భర్తనా?
పదిహేనేళ్ల నూరియా ఇంటిపై తాలిబన్లు దాడి చేసినప్పుడు ఆమె వారి నుంచి ఏకే47 లాక్కుని కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చింది. మూడో తీవ్రవాదికి గాయాలయ్యాయి.
ఆమె ధైర్యాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంది.. హీరో అంటూ కీర్తించింది. అయితే, ఆ రోజు రాత్రి జరిగిన అసలు కథ మాత్రం కొంచెం సంక్లిష్టంగా ఉంది.
ఇంతకీ నూరియా తాలిబన్లను చంపిందా..? తన భర్తను చంపిందా? అసలు రహస్యం ఏమిటి?
(ఘటనకు సంబంధించిన అందరి పేర్లను ఈ కథనంలో మార్చాం)
ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందో నూరియా 'బీబీసీ'కి వివరించారు.
''కొండ పక్కనే ఉన్న అమ్మానాన్నల ఇంట్లో ఉన్నాను. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించింది. ఆ చప్పుడుకు బెడ్ రూంలో ఉన్న నేను ఒక్కసారిగా నిద్ర లేచాను. కానీ, కదలకుండా అక్కడే ఉన్నాను. నాతో పాటు ఉన్న నా పన్నెండేళ్ల తమ్ముడి గురించే నా ఆందోళనంతా.
వాళ్లు మా అమ్మానాన్నను ఇంటి బయటకు తీసుకెళ్లారు. ఆ వెంటనే తుపాకీతో కాల్చిన శబ్దం వినిపించింది. అమ్మను, నాన్నను చంపేశారు'' అని చెప్పారామె.
అఫ్గానిస్తాన్లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగారు నూరియా. మెల్లగా మాట్లాడే, సిగ్గరి అయిన నూరియా గురి చూసి తుపాకీ కాల్చడంలో మాత్రం నేర్పరి.
ఆత్మరక్షణ కోసం చిన్నప్పటి నుంచే తండ్రి నేర్పించడంతో తుపాకీ పేల్చడంలో ఆమె నేర్పు సాధించారు.
ఆ రోజు రాత్రి తన తల్లి, తండ్రిని తాలిబన్లు బయటకు తీసుకెళ్లి కాల్చేయడంతో ఆమె ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. ఇంట్లో ఉన్న తన తండ్రి ఏకే-47ను చేతిలోకి తీసుకుని తాలిబన్లపై కాల్పులు జరిపింది.
''గన్లోని తూటాలన్నీ అయిపోయే వరకు అలా కాలుస్తూనే ఉన్నాన''ని చెప్పారు నూరియా.
దాడికి వచ్చినవారిలో కొందరు చీకట్లో కలిసిపోయారు. తన ఇంటి బయట అయిదు మృతదేహాలున్నాయి.
''అమ్మానాన్నల మృతదేహాలతో పాటు ఇంటి పక్కనే ఉన్న తాత.. నా చేతుల్లో చనిపోయిన ఇద్దరు తాలిబన్ల మృతదేహాలు పడున్నాయి'' అని చెప్పారు నూరియా.
''వాళ్లు చాలా క్రూరులు. వికలాంగుడైన నా తండ్రిని, అమాయకురాలైన నా తల్లిని చంపేశారు'' అంటూ నూరియా రోదించారు.
Comments
Post a Comment